+copy.jpg)
ఐదు శాతబ్దాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు సాగించిన తరహాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పాలనను అందించే నేత రాష్ట్రంలో మరెవ్వరూ లేరన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పాలనతో దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి పాలనను పోల్చవచ్చన్నారు. శ్రీకృష్ణదేవరాయలులా వైఎస్సార్ ప్రజారంజకమైన పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదల పాలిట పెన్నిధిగా మారిన వైఎస్సార్ సేవలను ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు అన్ని కళలను ప్రోత్సహించి, జనరంజకంగా పాలన సాగించారన్నారు. అదే తరహాలోనే దివంగత నేత వైఎస్సార్ ఉత్తమమైన పాలనను అందించి, కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.







